అమరావతి : ఏపీలో కాంగ్రెస్ పుంజు కోకుండా అధికార వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan) తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. చెల్లెలు షర్మిలకు షాకిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) ని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంతో షర్మిల కంగుతిన్నది . ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ షర్మిల వైఎస్ జగన్ను ఇరకాటంలో పెడుతూ పలు ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ బలం పుంచుకోక ముందే తన అనుచరవర్గీయులతో జగన్ ప్రత్యారోపణలు ప్రారంభించారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్లోని కీలక నేతలను వైసీపీలో చేర్పించేందుకు వ్యూహరచనలు సిద్ధం చేశారు.
నెల రోజుల క్రితం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సమక్షంలో కాంగ్రెస్ తీర్థం తీసుకున్న మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ పార్టీలో చేరారు. మంగళవారం తాడేపల్లి నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరిన వారిలో మొదటి ఎమ్మెల్యే. అయితే నెల రోజులుగా తనను పట్టించుకోవడం లేదన్న బాధతో ఆయన కాంగ్రెస్ (Congress) కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అగ్రనాయకుల్లో ఒకరు ఆళ్లతో సంప్రదింపులు మొదలు పెట్టి తిరిగి వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో కాంగ్రెస్ వర్గీయులు ఖంగుతిన్నారు. ఏపీలో ఇప్పుడిప్పుడే కాస్త జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆళ్ల నిర్ణయం ఊహించని షాక్ తగిలింది.
వైసీపీలో చేరిన సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్ఆర్ కుటుంబం భక్తుడినని, అందుకే వైసీపీని వీడిన తర్వాత షర్మిలమ్మ పార్టీలో చేరినట్లు చెప్పారు. ఏపీలోని కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకోవడం, ఆయన పాలనను దింపేయాలని భావిస్తూ ఉండటంతో జగన్కు అండగా ఉండాలనే ఉద్దేశంతో తిరిగి వైసీపీలో చేరినట్లు వెల్లడించారు. మంగళగిరిలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో తిరిగి వచ్చినట్లు చెప్పారు.