అమరావతి : ఒక్కసారిగా ఇంట్లోని వస్తువులు నేలపై పడడంతో గాఢ నిద్రలో ఉన్న జనం ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొద్ది సెకన్ల తరువాత స్థానికుల నుంచి భూమి కంపించిన విషయాన్ని తెలుసుకుని భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని పలమనేరు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది.
గంటూరు, గంగవరం మండలం బండమీద జరావారిపల్లి, కీలపట్ల, నలసానిపల్లి, గాంధీనగర్,కురప్పల్లి ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో 3 సార్లు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు బుధవారం గ్రామాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఆగస్టు రెండోవారంలో నెల్లూరు , ప్రకాశం జిల్లాలో పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.