తిరుమల: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేస్తున్నది జనం కోసమా లేక చంద్రబాబు కోసమా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబుకు ఆపద రాకుండా పవన్ కల్యాణ్ కాపాడుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. శనివారం ఉదయం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో కలిసి వచ్చిన మంత్రి రోజా.. వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తన గన్మెన్, డ్రైవర్ ఆలయ మహాద్వారం నుంచి వచ్చారని పలు ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ఎన్నో ఆలయాలను కూల్చివేసిన సమయంలో ఈ ఛానల్స్ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
పిల్లలు సరిగా చదవకపోవడం, కరోనా వల్లనే ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.పదో తరగతి పరీక్షల ఫలితాలపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడి మాదిరిగా రాజకీయాలు చేయడం లేదని గుర్తుచేశారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు, లోకేశ్ జూమ్ మీటింగ్ లోకి కొడాలి
నాని, వల్లభవనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారని రోజా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ మీద కోపమున్నందుకే తరచుగా పార్టీని మూసేస్తానంటున్నాడని చమత్కరించారు.