అమరావతి : రాష్ట్రంలోని క్రీడాకారులకు అండగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్’ ను తీసుకువచ్చినట్లు ఏపీ క్రీడలు, యువజన సర్వీసు శాఖల మంత్రి ఆర్కే రోజా చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఏపీ సచివాలయంలో శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డితోపాటు పలువురు క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రోజా జగనన్న స్పోర్ట్స్ యాప్ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలతోపాటు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ల ఏర్పాటు, జగనన్న స్పోర్ట్స్ యాప్ను ఉపయోగించుకునే విధానం, నూతన స్పోర్ట్స్ పాలసీపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ఈ యాప్ను విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాలకు చేరువయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. క్రీడలకు సంబంధించి పలు ప్రయోజనాలు అందివ్వనున్న జగనన్న యాప్ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో జగనన్న స్పోర్ట్స్ క్లబ్లను ఏర్పాటుచేయడంతోపాటు క్రీడాకారులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారులు ఈ యాప్లో తమ ఆటకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చడం ద్వారా ప్రోత్సాహకాలు అందుకునేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, శాప్ ఎండీ ప్రభాకర్రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.