అమరావతి: ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని ఏపీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాని చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పిదం లేదని, పనికిరాని విషయాన్ని టీడీపీ నేతలు ఎత్తిచూపాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించకుండా టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. నారా లోకేశ్ పిల్లి పిత్రి అని తీవ్రంగా ధ్వజమెత్తారు.
పనీపాట లేని టీడీపీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. గత మూడేండ్లుగా ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల గురించి అడిగే అర్హత చంద్రబాబుకు లేదన్న ఆమె.. టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువకులకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక లక్షా 21 వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చింది కనిపించడంలేదా అని ప్రశ్నించారు. అలాగే, వైద్యశాఖలో భర్తీచేసిన 42 వేల పోస్టులు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది కనిపించడంలేదా అని దుయ్యబట్టారు.
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి రోజా వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 26 గ్రామాల్లో రాజధాని కావాలంటున్నారని, ఇదే టీడపీని 26 జిల్లాల ప్రజలు కూకటి వేళ్లతో పీకేయడం ఖాయమన్నారు. అమరావతి కావాలా? మూడు రాజధానులు కావాలా? అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. పిల్లి పిత్రి లోకేశ్ తల్లి, భార్యతో తండ్రిని బెదిరించి దొడ్డ దారిన మంత్రి అయ్యారని, అలాంటి నువ్వు సీఎం జగన్ను విమర్శిస్తావా అని రోజా నిలదీశారు. లోకేశ్ ఒక అడ్రస్ లేని వెధవ అని, ఏది పడితే అది మాట్లాడితే జనాలు కొడతారు జాగ్రత్త అని హెచ్చరించారు.