చిత్తూరు: పలమనేరు మండలం పరిధిలోని గుండుగల్లు గ్రామంలో నూతన సచివాలయం కాంప్లెక్స్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సచివాలయం కాంప్లెక్స్ను రూ.40 లక్షల నిధులతో నిర్మించారు. అదేవిధంగా రూ.21.98 లక్షల ఖర్చుతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ జీ శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే పీ వెంకటగౌడ్, కుప్పం ఎమ్మెల్సీ భరత్, డీసీసీబీ చైర్పర్సన్ ఎం రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని సచివాలయ భవనాల నిర్మాణాలను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్లు, ఇతర నిర్మాణాలకు నిధుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.
గ్రామ సచివాలయ కాంప్లెక్సుల నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి ప్రతి గ్రామంలో పైపులైన్ల ద్వారా తాగునీటిని అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని.. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.190 కోట్లు మంజూరు చేయాలని ఇటీవల సీఎంకు వినతిపత్రం అందించినట్లు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చెప్పారు.