ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసన్నారు. తనకు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదని, బతికినంత కాలం జగన్తోనే వుంటానని స్పష్టం చేశారు. తన మంత్రి పదవి పోతే.. ప్రతిపక్షాలు తన విశ్వరూపం చూస్తాయని, ఓ రకంగా తనకు మంత్రి పదవి అడ్డమని అన్నారు. తాను ఏది మాట్లాడినా… ప్రభుత్వానికి అంటగడతారని, అదే ఏ పదవీ లేకపోతే.. తన విశ్వరూపం ఏమిటో తెలుస్తుందన్నారు. ఏ పదవీ ఆశించి, తాను వైసీపీలోకి రాలేదన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ కుటుంబం అనాథే…
మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ కుటుంబం అనాథ అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, అధికారికంగా దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. చంద్రబాబుకు ప్రస్తుతం 73 సంవత్సరాలని, ఇప్పుడు టీడీపీని ఎలా పరిగెత్తిస్తారని ఎద్దేవా చేశారు. ఏపీని పునర్నిర్మిస్తామని చంద్రబాబు బీరాలకు పోతున్నారని, ఏపీ అద్భుతంగా ఉందని స్పష్టం చేశారు. ఏపీని చంద్రబాబు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది జగన్ లక్ష్యమని, చంద్రబాబు లాగా రాష్ట్రాన్ని దోచుకోవడం తమకు అలవాటు లేదన్నారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలు ఓటు వేయరని తెలిసి, మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొడాలి నాని హెచ్చరించారు.