అమరావతి: ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని మంత్రి కన్నబాబు చెప్పారు. వ్యవసాయానికి వార్షిక బడ్జెట్లో రూ. 11,387.69 కోట్లు కేటాయించారు.
మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి రూ.614.23 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. సహకార సంఘాలకు రూ.248.45 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్కు రూ.146.41 కోట్లు, హార్టికల్చర్కు రూ.554 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.98.99 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.421.15 కోట్లు, వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి రూ.59.91 కోట్లు, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి రూ.122.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు చెప్పారు. అలాగే. రూ. 1027.82 కోట్లు పశుసంవర్ధక శాఖకు, రూ. 337.23 కోట్లు మత్స్య పరిశ్రమకు, రూ.5000 కోట్లు విద్యుత్ సబ్సిడీకి కేటాయించారు. నీటిపారుదల రంగానికి రూ.11,450.94 కోట్ల ప్రతిపాదనతో పాటు వైఎస్ఆర్ జలకళ కోసం రూ.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు అసెంబ్లీకి తెలిపారు.
ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్ లోనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ తమను ఆదేశించారని మంత్రి కన్నబాబు చెప్పారు. పంటల దిగుబడి పెరిగిందని, ధాన్యం సేకరణకు నూతన విధానాన్ని ఈ ఏడాది నుంచి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి రైతు తన పంట వివరాలను నమోదు చేసుకుంటే.. వారి పొలాల వద్దకు వెళ్లి పంట కొనుగోలు చేస్తామన్నారు. పెట్టుబడుల వ్యయాన్ని తగ్గించి మద్దతు ధర కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కన్నబాబు తెలిపారు.