Srisailam | శ్రీశైలంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకూ మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులు పాదయాత్రతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెంకటాపురం, నాగలూటి, దామర్లకుంట, పెద్ద చెరువు, మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారం మీదుగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. దీంతో పాదయాత్ర చేసే భక్తుల కోసం కాలిబాట మార్గంలో అటవీశాఖ, వైద్యారోగ్యశాఖ సహకారంతో వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాలిబాట మార్గంలో వసతులు, ఏర్పాట్లపై ఆదివారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జీ మురళీధర్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజినీర్ రంగ ప్రసాద్, అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ దొరస్వామి, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాలిబాట మార్గంలో మంచినీటి వసతి, నాగలూటి వద్ద భక్తులకు అన్నదానం కోసం సహాయ సహకారాలు, మార్గ సూచికల ఏర్పాటు, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలను ఈఓ పెద్ది రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది రాజు మాట్లాడుతూ అటవీశాఖ సహకారంతో నాగలూటి వద్ద భక్తులు సేద తీరడానికి వీలుగా జంగిల్ క్లియరెన్స్ చేపట్టామన్నారు. నాగలూటి వద్ద కోనేర్లను శుభ్ర పరిచే పనులను పరిశీలించారు. గతేడాది కంటే ఎక్కువగా పెద్ద చెరువు వద్ద అదనపు చలువ పందిళ్లు వేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
వెంకటాపురం, పెద్ద చెరువు, దామర్లగుంటలలో గతానికంటే ఎక్కువగా తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఈఓ పెద్దిరాజు ఆదేశించారు. గతేడాది కంటే కనీసం 20 శాతం అదనపు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నాగలూటి, పెద్ద చెరువు ప్రాంతాలకు గతేడాది కంటే ఎక్కువగా వాటర్ ట్యాంకర్లు పంపాలని నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు.
కాలిబాట మార్గంలో పాదయాత్ర చేస్తూ వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లు నొప్పులు తదితర సమస్యలతో ఇబ్బంది పడుతుంటారని ఈఓ పెద్దిరాజు చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం జిల్లా వైద్యశాఖతో సమన్వయం చేసుకుని అటవీ మార్గంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల్లో భక్తులకు ఆయింట్ మెంట్ (పూత మందులు), మాత్రలు (టాబ్లెట్లు) అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని దేవస్థాన వైద్య విభాగం అధికారులను ఈఓ పెద్ది రాజు ఆదేశించారు.