శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్బంగా సామూహిక వరమహాలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం చంద్రవతి కళ్యాణమండపంలో ఉదయం ఈవో లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 800 మందికి పైగా ముత్తైదువలు పాల్గొన్నారు.
అర్చక వేదపండితులు తొలుతగా గణపతిపూజ, స్వామిఅమ్మవార్లను ఆశీనులజేసి వరలక్ష్మీ అమ్మవారి ఆవాహన కళశస్థాపనతో షోడశోపచార క్రతువులను జరిపించారు. వ్రతంలో పాల్గొన్నవారికి స్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించి అమ్మవారి శేషవస్త్రంగా రవిక, గాజులు, పూలు, స్వామిఅమ్మవార్ల కంకణదారాలు మరియు శ్రీశైలప్రభ మాసపత్రికలను అందించి తీర్థప్రసాదాలతో పాటు నిత్యాన్నదానభవనంలో అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తి పీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ వ్రతం చేసుకోవడం పూర్వజన్మ సుకృతమని, వైదిక సంప్రదాయంలో జరుపుకునే ఈ వ్రతంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
అదేవిధంగా చైర్మెన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల సమక్షంలో జరుపుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టమని, స్వామిఅమ్మవార్ల అనుగ్రహంతో వ్రతాన్ని జరుపుకున్న వారందరికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.