TTD | హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను సోమవారం నాడు టీటీడీ విడుదల చేయనుంది. మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల్లో పాల్గొనే భక్తులకు టికెట్ల బుకింగ్ ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఓపెన్ అవుతాయి. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా బుకింగ్ మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతాయి.
డిసెంబర్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. టికెట్లను భక్తులు https://tirupatibalaji.ap.gov.inలో బుక్ చేసుకోవచ్చు.