విశాఖ: చాలాకాలం తర్వాత విశాఖ ఏజెన్సీలో మళ్లీ మావోల హెచ్చరికల స్వరం వినిపించింది. అది కూడా అధికార వైసీపీకి చెందిన పాడేరు మహిళా ఎమ్మెల్యే కొట్టిగళ్ల భాగ్యలక్ష్మిని టార్గెట్ చేశారు. ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మన్యం విడిచిపెట్టి వెళ్లిపోవాలంటూ లేఖను విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలైంది. దాంతో విశాఖ ఏజెన్సీలో కలకలం చెలరేగింది.
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని సోమవారం విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. లాటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు ఏజెన్సీలో విచ్చలవిడిగా జరుపుతున్నారని, ఇదంతా ఎమ్మెల్యే అండదండలతోనే జరుగుతున్నదని భావిస్తున్నట్లు మావోయిస్టులు చెప్పారు. విశాఖ మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న మైనింగ్ ను ఆపేయాలని హెచ్చరించారు. తక్షణం ఎమ్మెల్యే పదవికి భాగ్యలక్ష్మి రాజీనామా చేయాలని, ఆమె ఏకంగా మన్యం ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లాలని కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. తమ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకపోయినా అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల తరహాలోనే ప్రజాకోర్టులో ప్రజలు శిక్షిస్తారని వార్నింగ్ ఇచ్చారు.
మావోయిస్టుల హెచ్చరికలతో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి భద్రతను మరింత పెంచారు. గతంలో ఇదే ఆరోపణలతో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హతమార్చారు. మావోయిస్టుల లేఖ నేపథ్యంలో పాడేరు ప్రాంతంలో పోలీసు పహారాను పెంచారు. ఎమ్మెల్యే తమకు చెప్పకుండా పాడేరు ప్రాంతంలో పర్యటించరాదని పోలీసులు సూచిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిగానీ, వైసీపీ పెద్దలు గానీ ఇంతవరకు వారి స్పందన తెలియజేయలేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళా ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ రావడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది.