ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా ఎదుట మావోయిస్టు దంపతులు కమలేశ్-అరుణ లొంగిపోయారు. వీరిలో కమలేశ్పై రూ.20లక్షలు, అరుణపై రూ.5లక్షల రివార్డు ఉందని డీజీపీ తెలిపారు. ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించిన హరీశ్గుప్తా.. ఏవోబీ పరిధిలో భారీ ఆయుధాల డంప్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏకే 47, హ్యాండ్ గ్రనేడ్లు, ఇతర ఆయుధాల స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయని చెప్పారు.
మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని జాయింట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా తెలిపారు. ఏపీకి చెందిన దాదాపు 21 మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు హింసను వీడాలని ఆయన పిలుపునిచ్చారు. వారంతా వచ్చే ఏడు నెలల్లో అంటే వచ్చే మార్చి లోగా లొంగిపోవాలని కోరారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి వస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. వారంతా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.