హైదరాబాద్ : ఏపీలో పలు తీర ప్రాంతాల్లో ‘మిచాంగ్’ తుఫాన్ (Michang typhoon) ప్రభావం వల్ల దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలోని రైల్వే అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఏపీలో పలు రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 156 రైళ్లను రద్దు(Cancell) చేసినట్లు శనివారం రైల్వే అధికారులు వెల్లడించారు. ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండడంతో తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నాయి. దీంతో ముందస్తుగా నిజాంపట్నం హార్బర్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు భారత వాతావరణ కేంద్రం అధికారులు జారీ చేశారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి వాతావరణ శాఖ ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని ప్రకటించారు. ప్రస్తుతం నెల్లూరుకు 860 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 910 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారడంతో తమిళనాడుకు కూడా ముప్పు పొంచి ఉంది. చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. తొమ్మిది నౌకాశ్రయాల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికలు ఇచ్చారు. రాగల మూడు రోజులు కీలకమని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.