హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొడుతూ వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆలమూరి రఫీ ఆధ్వర్యంలో కడప, బద్వే ల్, జమ్మలమడుగు, కమలాపురం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా పెట్రేగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని ధ్వజమెత్తారు. టీడీపీ, వైసీపీ పాలనలో విసిగివేసారిన ప్రజానీకం బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, తెలంగాణ మాడల్ అభివృద్ధి ఇక్కడా కావాలని ఆకాంక్షగా ఉన్నట్టు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో ఎడవల్లి తేజేశ్వర, కిన్నెర మాణిక్యమ్మ, ఎడవల్లి శశికళ, మద్దూరి వినయ్, ముబారక్ బాషా, అట్టివాసు ఇంద్రజ, దర్రె సావిత్రి, పార్వతమ్మ, రామకృష్ణ తదితరులు ఉన్నారు.