AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తమను అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని దేవినేని అవినాశ్, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని కండీషన్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్41ఏ కింద మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి గుంటూరు సబ్ జైలులో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్కు మంగళగిరి న్యాయస్థానం పోలీసు కస్టడీ విధించింది. విచారణ సమయంలో నందిగం సురేశ్ తమకు సహకరించలేదని.. కేసు దర్యాప్తు కోసం విచారణ చేసేందుకు ఆయన్ను కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు విచారణ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.