Srisailam | ద్వాదశ జ్యోతిర్లింగం..అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహోత్సవ వేడుకలు శుక్రవారం శాస్త్రోకంగా ప్రారంభమయ్యాయి.
దేవస్థానం ఈఓ పెద్దిరాజు దంపతులు శుక్రవారం ఉదయం సంప్రదాయబద్దంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో ముఖద్వారం నుండి ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం యాగశాల ప్రవేశం చేశారు.
అటుపై లోక కళ్యాణం కాంక్షిస్తూ మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏడు రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు ఘనంగా జరగాలని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను కోరుకున్నారు.
అతివృష్టి, అనావృష్టి నివారించబడి, పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఋత్వికులు శివ సంకల్పం పఠించారు.
ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని తొలుతగా గణపతిపూజ, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణ ధారణ, ఋత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం ప్రధాన కళశ స్థాపన కార్యక్రమాలు జరిపించారు.సాయంత్రం భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకుర్పారణ చేసే క్రతువును ఘనంగా చేశారు.
ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనం, ప్రమద గణాదీశుడైన నందీశ్వరుని ప్రతిమతోపాటు అష్ట మంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్ని చండీశ్వరస్వామి సమక్షంలో ధ్వజస్తంభంపై నూలు తాడుతో సిద్దం చేసిన పతాకాన్ని ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి ప్రత్యేక పూజాధికాలు చేసి ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు.
అనంతరం భేరిపూజ చేసి మేళతాళాల రాగాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీ అని ప్రధాన అర్చకులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చే యక్ష, గంధర్వ గణాలకు ఆలయ ప్రాంగణంలో నిర్ణీత స్థలాలు కేటాయించి నిత్యోత్సవ పూజలు జరిపిస్తారని అర్చక పండితులు స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు, భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడి సందడిగా మారింది.