శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి మొదలవనున్నాయి. ఉదయం యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు ఉంటాయని ఆయన చెప్పారు. యాగశాల ప్రవేశం, వేదస్వస్థి, శివసంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవచనం, చండీశ్వరపూజ, వాస్తుహోమం, మండపారాధనలు, రుద్రకళశ స్థాపన, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజాధికాలు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.
మకర సంక్రమణం రోజున గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి కల్యాణం ఆలయ సాంప్రదాయం ప్రకారం.. జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాల చివరి రోజున పుష్పోత్సవసేవ, శయనోత్సవ సేవ ఘనంగా నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రంలో జరిగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్ల ఆర్జిత – పరోక్ష సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఈఓ ప్రకటించారు.
మకర సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతీ సాంప్రదాయాలను అనుసరిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో భోగి పర్వదినాన ఉదయం 10 గంటలకు అక్కమహాదేవి అలంకార మండపంలో ఐదు సంవత్సరాల వయస్సులోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్లు పోసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అదే విధంగా సంక్రాంతి పండుగ రోజున మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఇందులో స్థానికులతోపాటు భక్తులు కూడా పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భృంగివాహన సేవ, ప్రాకారోత్సవం, రావణవాహన సేవ, నందివాహన సేవ, కల్యాణ మహోత్సవం, కైలాస వాహన సేవ, రుద్ర చండీయాగాలకు పూర్ణాహుతి, త్రిశూల స్నానం, ధ్వజావరోహణ అశ్వవాహన సేవ, ఆలయోత్సవం, పుష్పోత్సవ, శయనోత్సవసేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను ఈవో లవన్న పరిశీలించారు. కృష్ణదేవరాయ గోపురం, నాగులకట్ట, అమ్మవారి ఆలయం, కల్యాణమండపం, నిత్యకల్యాణమండప ప్రాంగణాన్ని పరిశీలించారు. ముఖ మండపంలో మరో క్యూలైన్ ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వీవీఐపీలకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తర, పశ్చిమ భాగాల్లో భక్తులు పాగాను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులు, దీక్షాపరులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించాలని చెప్పారు.
శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే యాత్రికులకు ఉచిత వైద్యం అందించడంతోపాటు అత్యవసర సమయంలో దేవస్థానం వైద్యశాల సిబ్బంది పని తీరు అభినందనీయమని ట్రస్ట్బోర్డ్ సభ్యురాలు కనకదుర్గ అన్నారు. బుధవారం ఉదయం ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆమె వైద్యశాలలో గర్భిణులకు ప్రత్యేక పరిక్షలు నిర్వహించి, జాగ్రత్తలపై వివరించారు. అదే విధంగా దవాఖాన నిర్వహణ మందుల పంపిణీపై విషయాలను అడిగి తెలుసుకున్నారు.