అమరావతి : రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆదివారం నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. న్యాయస్థానం నుంచి తిరుమల, తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర పేరిట రైతులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు నిలిపివేసిన పాదయాత్రను 21 వ రోజు జిల్లాలోని రాజువారి చింత పాలెం నుంచి కావలి వరకు కొనసాగనుంది.
పాదయాత్రకు అడుగడుగునా స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా తిరుమలకు చేరుకోనంది. మొత్తం 45 రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్ర కు స్థానికుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని జేఏసీ నాయకులు వెల్లడించారు.