అమరావతి : ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మంగళవారం 30వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా అంబాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర నేటి నుంచి ప్రతిరోజూ 13 బదులు 15 కి.మీలు కొనసాగించాలని అమరావతి పోరాట సమితి నాయకులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయమైన ఆందోళనకు వైసీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడానికి ఇష్టం ఉన్నా అధిష్టానం ఆలోచనకు భిన్నంగా మాట్లాడలేకపోతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ సహచర ఎమ్మెల్యేల అభిష్టాన్ని గుర్తించి అమరావతి రాజధానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 15నాటికి అలిపిరికి చేరుకుంటామని రైతులు తెలిపారు. అదేరోజు బహిరంగ సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు.