అమరావతి : ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానినే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన రైతుల మహాపాదయాత్ర ఇవాళ కృష్ణా జిల్లా కౌతావరం నుంచి ప్రారంభమైంది. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా సాయంత్రం వరకు గుడివాడలోని నాగవరప్పాడు వరకు దాదాపు 15 కిమీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు గుడివాడలో రైతుల పాదయాత్రపై ఆంక్షలు విధించడం పట్ల రైతులు మండిపడ్డారు.
కంకిపాడు మండలం దాములూరు టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న రైతులనే పాదయాత్రకు అనుమతిస్తూ అడ్డుకునే యత్నం చేశారు. ఐడీ కార్డులు లేని 20 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రకు సంఘీభావంగా పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జి రూ. 5లక్షల చెక్కును పరిరక్షణ సమితి నాయకులకు అందజేశారు.