Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు జరిపించారు.
అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన,నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం సాయంకాల పూజలు జపానుష్టాధి పూజాధి కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్పమూర్తులను కైలాస వాహనంపై వేంచేంబు చేసి షోడషోపచార ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసవాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం వలన కోరిన కోరికలు నేరవేరుతాయని సకల శుభాలు కలుగుతాయని ఇతిహసాలు చెబుతున్నాయి.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశ్రీశైల భ్రమరాంబ అమ్మవారు మహాదుర్గ అలంకరణలో భక్తులను కరుణించారు. అష్టభుజాలు కలిగిన ఈ దేవి పద్మం, శంఖం, చక్రం,గధ, త్రిశూలం, ఖడ్గం ధరించి భక్తులకు దర్శనం ఇచ్చారు.
వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుండి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం కన్నుల పండవగా సాగింది. ఈ కార్యక్రమంలో ఈవో లవన్నతో పాటు పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్కుమార్, ఏఈఓలు హరిదాస్, ఫణిధర్ ప్రసాద్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ అయ్యన్న, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా ఆలయ దక్షిణ మాఢవీధిలోని కళారాధన, పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన భక్తసంగీత విభావరి, సంప్రదాయ నృత్యాలు, ప్రవచనం, డోలు కుణిత,హైదరాబాద్ సంగీత దర్శకులు నిహల్ బృందం సంగీతం భక్తులను అలరించాయి.
శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం క్షేత్ర పరిధిలో పలుచోట్ల సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. సమాచార కేంద్రంలో సమస్యలను తెలియజేయగానే శివ సేవకుల ద్వారా కంట్రోల్ రూమ్కు చెప్పడంతో అధికారులు, సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. అదేవిధంగా ఈవో క్షేత్రంలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు.
యాంపీ థియేటర్, మల్లమ్మ కన్నీరు, ఉద్యానవనాలు, పార్కింగ్ ప్రదేశాలు,, సమాచార కేంద్రాలను పరిశీలించారు. భక్తులకు వసతుల కల్పనలో సమన్వయంతో వ్యవహరించాలని, ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి కనబర్చాలన్నారు. ముఖ్యంగా మంచినీరు, పారిశుద్యం నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. అధిక రేట్లతో వస్తువులను విక్రయించే దుకాణాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
శ్రీశైల క్షేత్ర పరిధిలో స్వచ్చంద సంస్థలు, ఆశ్రమ వాసులు ఉగాది ఉత్సవాల సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణాదేవి ఆశ్రమ ప్రాంగణంలో శివోహం టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ నిర్వహకులు అంతిరెడ్డి అరవింద్ రెడ్డి తెలిపారు. భక్తులకు సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం, స్వామి అమ్మవార్ల సేవలో సద్గురు సనారీ విశ్వేశ్వర స్వామి, ఆశ్రమ భక్తులు తిరుపతి నాయన రమణమ్మ ఆశీస్సులతో శివోహం టెంపుల్ ట్రస్ట్ ప్రతి ఏటా అన్నదానం చేస్తున్నారని తెలిపారు.