అమరావతి: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివాలయాల్లో సందడి నెలకొన్నది. రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రమైన శ్రీశైలంలో భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతోపాటు పరిసర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతిలోని అమరేశ్వర దేవాలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నది. మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తెల్లవారుజాము నుంచే కృష్ణానది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. బాలచాముండిక సమేతంగా అమరేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శివక్షేత్రమైన శ్రీశైలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. తొలుత అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, సాయంత్రం నందివాహన సేవ నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అమ్మవారిని కిరీటం అలంకరిస్తారు. అనంతరం 12 గంటలకు పరమేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణోత్సవం జరుపుతారు.
మహా శివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత ఉన్నది. శైవక్షేత్రాల్లో మరెక్కడా జరగని విధంగా విశిష్టసేవ శ్రీశైలజ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా చేపడుతున్నారు. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన ఫృధ్వీ వెంకటేశ్వర్లు అనే చేనేత కుటుంబం మూడు తరాలుగా శ్రీశైల మల్లన్నకు తలపాగాను అలంకరిస్తున్నది. ఏడాదిపాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని నేస్తారు. స్వామివారి కల్యాణం సందర్భంగా అలంకరించేందుకు ఫృధ్వీ వెంకటేశ్వర్లు కుటుంబం ఈ తలపాగాను సోమవారం నాడు ఆలయం అధికారులకు అందజేశారు.
మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. త్రికోటేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం శివకల్యాణం నిర్వహిస్తారు. శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.