హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): విశాఖలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పోలీసుల వేషంతో నిరుద్యోగ యువతను ఓ ప్రేమజంట మోసం చేసిన ఘటన కలకలం రేపింది. అడవివరానికి చెందిన హనుమంతు సురేశ్, అతని ప్రియురాలు కలిసి పోలీసు ఉద్యోగాల ఎర చూపి.. 30 మంది నిరుద్యోగ యువత నుంచి రూ.3 కోట్లు దోచుకున్నారు.
ఈ నకిలీ పోలీసు జంట ఎస్సై యూనిఫాంలో రావటం చూసి మోసపోయిన యువత మధ్యవర్తుల ద్వారా డబ్బు ముట్టజెప్పారు. ఈ కేసులో నిందితుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉంటూ మోసానికి పాల్పడ్డట్టు గుర్తించిన పోలీసులు గురువారం నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని కమిషనర్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం వీరిని రహస్య ప్రదేశానికి తరలించి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.