ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా జీవితంలో స్థిరపడితే పెద్దలే తమ పెళ్లి చేస్తారని అనుకున్నారు. అదే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడ్డారు. కానీ ఈ క్రమంలో వచ్చిన చిన్న మనస్పర్థలే అంతా తలకిందులు చేసింది. చిన్నపాటి గొడవకే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కడప జిల్లా చెన్నూరుకు చెందిన యోగేంద్రకుమార్ వర్మ (19), హేమశ్రీ(19) ఇద్దరూ కడప నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో చదువుతున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో కష్టపడి చదవి జీవితంలో స్థిరపడ్డాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని నిర్ణయించారు.
కానీ ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన యోగేంద్ర కుమార్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన హేమశ్రీ కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వారి ప్రేమ గురించి తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కలిసి జీవించలేకపోయారు.. కనీసం మరణంలో అయినా కలిసి సాగనంపాలని నిర్ణయించుకుని.. చెన్నూరు సమీపంలో ఒకే ప్రాంతంలో ఇద్దరిని ఖననం చేసి, అంత్యక్రియలు పూర్తి చేశారు.