హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చినందున మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలంగాణ లారీ ఓనర్స్, లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్తో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, నాయకుడు నందారెడ్డి, లారీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి యాదయ్యగౌడ్ తదితరులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కౌంటర్ సిగ్నేచర్, గ్రీన్ ట్యాక్స్ , మూడు నెలల ఒక్కసారి ట్యాక్స్ రద్దుపై క్లారిటీ ఇచ్చారని వారు వెల్లడించారు. త్వరలో తమ సమస్యలను పరిష్కరిస్తూ జీవో రూపంలో ఇస్తామని సీఎస్ చెప్పారని వివరించారు.
యాదయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలతో రవాణా రంగానికి చెందిన కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు అండగా నిలిచిందని తెలిపారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కే మద్దతు ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.