తిరుపతి :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. వీరికి వసతులు పెంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎఫ్ఎ అండ్ సీఈవో బాలాజీతో కలిసి ఆయన ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. యాగశాలలో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని తొలగించడం వల్ల ప్రదక్షిణ చేయడానికి సౌకర్యంగా ఉందన్నారు.
ప్రసాదాల పంపిణీ కేంద్రాల వద్ద క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని అదనపు ఆరోగ్యాధికారికి సూచించారు. ఫ్రైడే గార్డెన్లో దిగుడు బావిని పరిశీలించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. బావిలోని ఊట నీరు ఆలయ అవసరాలకు ఉపయోగపడతాయేమో పరిశీలన జరపాలని పేర్కొన్నారు.
అనంతరం పూలమాలల తయారీ ప్రాంతం, పిండి మర, విద్యుత్ గదిని పరిశీలించారు. అమ్మవారి ఆలయ పుష్కరిణి సందర్శించి అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. తోళప్ప గార్డెన్, వాహన మండపం వద్ద జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.