ఏలూరు: వారం క్రితం అనంతపురం జిల్లా రాయచోటిలో.. రెండు రోజుల క్రితం తిరుపతిలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయగా.. ఇవాళ ఏలూరు పోలీసులు కూడా ఆ పని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.80 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. ఏలూరులోని ఆటోనగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద ఉన్న మైదానంలో కుప్పలుగా పోసి ప్రొక్లెయినర్తో తొక్కించారు. ఈ ఘటన పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు జిల్లా పరిధిలోని 7 ఎస్ఈబీ సర్కిళ్ల పరిధిలో 2021 నుంచి గత మార్చి వరకు 1083 అక్రమ మద్యం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 33,933 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పటల్ ఎదురుగా ఆటోనగర్ రైల్వే క్వార్టర్స్ వద్ద వాటిని ధ్వంసం చేశారు. ఈ మొత్తం బాటిళ్ల విలువ దాదాపు రూ.90 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరో 70 వేల మద్యం బాటిళ్లను మరో రెండు రోజుల్లో ధ్వంసం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
ప్రభుత్వ ఆదేశం మేరకు సరిహద్దు చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నాటు సారా తయారీపై తీసుకుంటూ, సామగ్రి సరఫరా చేసే వారిపై చర్యలు చేపడతామని చెప్పారు. అక్రమ మద్యం విక్రయిస్తే నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.