హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఓ సందర్శకుడు సెల్ఫీ మోజులో జూపార్కులోని సింహం ఎన్క్లోజర్లోకి వెళ్లి దాని పంజాకు బలయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నగర శివారులోని ఎస్వీ జూపార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న సందర్శకుడు సింహంతో సెల్ఫీ దిగేందుకు ఎన్క్లోజర్లోకి వెళ్లాడు. సింహం గర్జించడంతో భయపడి ఓ చెట్టు ఎక్కాడు. కొమ్మ విరిగిపడటంతో సింహం పంజా విసిరింది. అతని మెడపై దాడి చేసి నోటితో కొరికింది.
తీవ్రగాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38)గా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్క్లోజర్లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్టు జూపార్కు సిబ్బంది తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. జూలోనికి సందర్శకులను సైతం అనుమతిని నిరాకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.