విజయవాడ: ఆపత్కాలంలో ఒకరి ప్రాణాలను కాపాడటాన్ని మించిన ఆనందం మరే దానిలోనూ దొరకదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. దయ, కరుణ, జాలి వంటివి పెంపొందించేందుకు ఒకరికొకరు తోడుగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించే సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బుధవారం విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై ప్రసంగించారు.
ఇటీవలి కాలంలో జీవనశైలిలో వస్తున్న మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వీటి ద్వారా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సీపీఆర్ నేర్చుకోవడం వల్ల మన కళ్ల ముందు ఎవరైనా గుండెపోటుకు గురయితే వారికి ప్రాణదానం చేయవచ్చన్నారు. పాఠశాలల్లోనూ సీపీఆర్ శిక్షణ అందించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో దయ, కరుణ, జాతి, సాయం వంటి విషయాలతోపాటు ప్రాణదానంపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రిసస్సిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ ఛైర్మన్ చక్రరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు.