అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ దృష్టిని సారించింది. స్వయాన ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు మృతురాలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక తల్లిదండ్రులను ప్రభుత్వం తరుఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. 13 ఏండ్ల బాలికను టీడీపీ నాయకుడు వినోద్ జైన్ చాలా ఇబ్బంది పెట్టాడని, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా వ్యవహరించాడని వివరించారు. నిందితుడు వినోద్జైన్కు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుడి సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటుందని, చంద్రబాబు ప్రోత్సహించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. టీడీపీ నేతలు నీచరాజకీయాలు మానుకోవాలని సూచించారు. కాగా చిన్నారి ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.