నెల్లూరు : ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన, ఐశ్వర్యవంతమైన, ఆర్థికంగా శక్తిశాలి అయిన భారతదేశాన్ని నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సేవాసంస్థలు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భారతదేశ భవిష్యత్ అయిన యువతరం కష్టపడి పని చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలికాలంలో యువతరం జీవన విధానం మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయన్న ఆయన.. క్రమశిక్షణా యుతమైన జీవన విధానాన్ని యువత అలవాటు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం తనకెంతో తృప్తినిస్తుందన్న ఉపరాష్ట్రపతి, ఈ సంస్థ కార్యక్రమాలను అన్నీ తానై చూసుకుంటున్న దీపావెంకట్కు అభినందనలు తెలిపారు. ప్రతి ఊరిలో ఓ దేవాలయం, ఓ విద్యాలయం, ఓ వైద్యాలయం, ఓ గ్రంథాలయంతో పాటు ఓ సేవాలయం కూడా ఉండాలని సూచించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు సమాజ సంక్షేమం కోసం ఈ దిశగా చొరవ తీసుకోవాలని సూచించారు.
చెన్నైలోని గ్లోబల్ హాస్పిటల్ వైద్యులచే గుండె, ఊపిరితిత్తులు, కీళ్ళు, ఎముకలు, గర్భకోశం, మధుమేహం, కంటి, దంత వైద్య పరీక్షలతో పాటు సాధారణ వ్యాధుల పరీక్షలను ఈ సందర్భంగా ఉచితంగా చేపట్టారు. ఈసీజీ, టూడీ ఎకో గుండె పరీక్ష, ల్యాబ్ పరీక్షలు చేసి మందులు అందజేశారు. కంటి శుక్లాలతో బాధపడే వారికి ఉచిత ఆపరేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. 500 మందికిపైగా ఈ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.