తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం లక్ష బిల్వార్చన సేవను నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఇందులోభాగంగా తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారని వెల్లడించారు.
ఉదయం 6 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చిస్తారన్నారు. ఒక్కొక్కరు రూ.100లు టికెట్ కొనుగోలు చేసి లక్ష బిల్వార్చన సేవలో పాల్గొనవచ్చని వివరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్నామని తెలిపారు.