బాలాజీ జిల్లా : తిరుపతి సమీపంలోని పాతకాల్వ లో శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం క్షీరాధివాసం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) నిర్మించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ వకుళామాత ఆలయానికి వచ్చారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కలశారాధన, ఉక్తహోమాలు, నవకలశ స్నపన క్షీరాధివాసం నిర్వహించారు. అమ్మవారి విగ్రహనికి వేద మంత్రాల మధ్య పాలతో విశేషంగా అభిషేకం (క్షీరాధివాసం) చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు కలశారాధన, విశేష హోమాలు, వైదిక కార్యక్రమాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ గుణ భూషణ్ రెడ్డి, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యులు, ఇతర అధికారులు, రుత్వికులు పాల్గొన్నారు.