కృష్ణా: నాటుసారాను కూకటివేళ్లతో పెకిలించేందుకు జిల్లా పోలీసులు సమర శంఖం పూరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసులకు కార్యాచరణ అందించారు. దాంతో ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహించి బెల్లం ఊటలను ధ్వంసం చేస్తున్నారు. సారా తయారీదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.
నాటు సారాను సమూలంగా నిర్మూలించేలా నాటు సారా తయారీ కేంద్రాలపై అడపాదడపా దాడులు నిర్వహిస్తున్న పోలీసులకు జిల్లా ఎస్పీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. దాంతో పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిఘా పెంచారు. నాటు సారా తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా నాటు సారా తయారీ చాలా వరకు తగ్గిపోయింది.
ఈ సందర్భంగా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 1069 కేసులు నమోదు చేసి, మొత్తం 12,524 లీటర్ల నాటుసారాను సీజ్ చేసి ధ్వంసం చేసినట్లు తెలిపారు. నాటుసారా కట్టడికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్తో కలిసి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, రిపీటెడ్ నేరస్తులపై నిరంతర నిఘా పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను కాదని నాటు సారా తయారీకి పాల్పడితే వారిపై మరింత కఠినంగా వ్యవహరించి వారిపై పీడీ యాక్ట్ను అమలు పరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ధర్మేంద్ర , బందరు డీఎస్పీ మాసుం భాష , ట్రాఫిక్ డీఎస్పీ భరత్ మాతాజి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.