YS Sharmila | వైఎస్ షర్మిలపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తూ ఆమె రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. షర్మిల చేస్తున్న విష ప్రచారాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
కడప జిల్లాలో వైఎస్ పేరు చెప్పి తిరిగితే ఒప్పుకోమని కొండా రాఘవరెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల చేతిలో షర్మిల కీలు బొమ్మలా తయారయ్యారని విమర్శించారు. షర్మిల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. రాహుల్ను ప్రధాని చేయాలన్న విషయం షర్మిలకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ నుంచి కొండా రాఘవరెడ్డి ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ మరణం తర్వాత కొండా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. జగన్ వైసీపీ పార్టీ పెడితే అందులో చేరారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ పార్టీ ఏపీకే పరిమితమయ్యింది. దీంతో కొండా రాఘవరెడ్డి సైలెంట్గా ఉండిపోయారు. ఇటీవల షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ ఏర్పాటు చేయడంతో అందులో చేరారు. అందులో కీలక నేతగా కొనసాగారు. అయితే, వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని షర్మిల నిర్ణయించుకోవడం కొండా రాఘవరెడ్డికి నచ్చలేదు. దీంతో షర్మిల పార్టీకి రాఘవరెడ్డి రాజీనామా చేశారు.