అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు అంతా సవ్యంగా పూర్తయినా.. కోనసీమ జిల్లా పేరు విషయంలో మాత్రం ఇంకా కోపం చల్లారడం లేదు. జిల్లా పేరును మార్చడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. పలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా పేరుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు ప్రభుత్వం పెట్టిన గడువు ఐదు రోజుల క్రితం ముగిసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందా? అని సర్వత్రా ఎదురుచూస్తున్నారు. పేరు మార్పుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొన్నది.
కొత్త రాష్ట్రాల ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ సర్కార్.. కోనసీమ జిల్లాను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నది. అయితే, కొన్ని వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయం ఆనోటా ఈనోటా జిల్లా అంతటా వ్యాప్తి చెందిన నిరసనజ్వాలలకు ఆజ్యం పోసినట్లయింది. ఈ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిన వర్గం వారు అమలాపురంలో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ను ముట్టడించడంతో పాటు ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంత్రి పినిపె విశ్వరూప్, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి.. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రైమరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 18 నుంచి జూన్ 18 లోపు అభ్యంతరాలు, సూచనలు అందించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆ మేరకు కోనసీమ జిల్లాలోని 22 మండలాల ప్రజల నుంచి విజ్ఞప్తులను అధికారులు స్వీకరించారు. వీటి అన్నింటినీ క్రోడీకరించి.. నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం గతంలో తెలిపింది. ఈ గడువు శనివారం నాటికి ముగియడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆందోళనలు, అల్లర్లు జరిగిన నేపథ్యంలో సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా తయారైంది.