తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. మంగళవారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతో ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 26న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఏటా.. ఉగాది, అణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగు సార్లు శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. దీనినే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటారు. కోయిల్ అంటే గుడి.. ఆళ్వార్ అంటే భక్తుడు. శ్రీ వైష్ణవ పరంపరలో ఆళ్వార్లు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన భక్తులు. తిరుమంజనం అంటే అభిషేకం. కర్పూరం, చందనం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ.. తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి శ్రీవారి ఆలయాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో శుద్ధి చేస్తారు. అందుకే ఈ సేవకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది.