తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 16న శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించినట్లు చెప్పారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
కాగా, శుద్ధి సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, ఆరోగ్య విభాగం అధికారి డాక్టర్ సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.