తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీవరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఈ క్రమంలో.. మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం.. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
ఇక కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన పరదాల మణి అనే భక్తుడు.. రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈవో గురుమూర్తి, ప్రధానార్చకులు బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ పాల్గొన్నారు.