తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవను రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
20 నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తి క బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం 19వ తేదీన ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి9 గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయని టీటీడీ అధికారులు తెలిపారు.