తిరుమల : ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది . ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఉగాది, ఆణివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయశుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈరోజు తిరుమంజనం వైభవంగా నిర్వహించామని వెల్లడించారు.
ఆళ్వార్ తిరమంజనం సందర్భంగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం సుగంధ ద్రవ్యాలతో ఏర్పాటు చేసిన పరిమళాన్ని స్వామి వారికీ సమర్పించి,ఆలయ గోడలపై పూతగా పూయడం జరిగిందన్నారు. స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం పొందే భక్తులు రేపు తిరుమలకు చేరుకుని ఉండాలని పేర్కొన్నారు.
పాలకమండలి నిర్ణయం మేరకు నేటి నుంచి గదుల కేటాయింపును తిరుమలలో తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ఇవాళ స్వామి వారి దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తామన్నారు.. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించే స్వర్ణరథం ఊరేగింపును 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో లాగేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.