తిరుపతి : శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారు. తిరుపతి పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, శీకాకాయ, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు.
అంతకుముందు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పుణ్యాహవచనం, రత్నాధివాసం, విమాన గోపుర కలశ స్థాపన, రత్నన్యాసం, ధాతు న్యాసం, విగ్రహ స్థాపన, అష్టబంధనం, యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు మహాశాంతి అభిషేకం, రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు అగ్నిప్రణయనం, కుంభారాధన, శయనాధివాసం, సర్వదేవతార్చన, విశేష హోమాలు, యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.
గురువారం 23 న ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరవనున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్నఏర్పాట్లను ఈఓ ఏవీ ధర్మారెడ్డి టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమొంటు సభ్యులు మిథున్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పోకల ఆశోక్ కుమార్, రాములు, జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్, సీఈ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఓ గుణభూషణ్రెడ్డితో పాటు పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు.