అమరావతి : గుడివాడలోని తన సొంత కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించిన మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోమవు వీర్రాజు డిమాండ్ చేశారు. క్యాసినో క్రీడలపై వైసీపీ ప్రభుత్వానికి ఎనలేని మమకారం ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆత్మకూరులో వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంటే బీజేపీ నేత శ్రీకాంత్రెడ్డిపై దాడి చేసి కేసులు నమోదు చేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. హిందూ ఆలయాలు, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టరా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జాతీయవాద రాజకీయాలే తమ లక్ష్యమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మసీదులు, చర్చిల నిర్మాణం జరుగుతుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఆలయ భూములను అమ్మాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.