జగన్ బతికున్నంత కాలం ఆయనే ఏపీకి సీఎంగా ఉండాలని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ కోసం పేదలందరూ ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. జగన్ గనక రాజకీయాల్లో లేకపోతే… పేద ప్రజల ఇళ్ల కోసం అల్లాడిపోయే వారని చెప్పుకొచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాని గుడివాడలో పాల్గొన్నారు.
డిసెంబర్ 21 న ముఖ్యమంత్రి జగన్ జన్మదినం సందర్భంగా విజయవాడలో పేదలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తానని కొడాలి నాని ప్రకటించారు. తన నియోజకవర్గంలో తనకు ఇళ్లు లేదని ఒక్క పేదవాడు అడిగినా.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. నాలుగు లక్షల మంది వాలెంటీర్లతో ప్రజలకు పాలనను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.
మా సీట్లు మాకు వస్తాయి.. నాని
పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా.. తమకు కలిగే నష్టమేమీ ఉండదని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తమ 151 సీట్లు తమకు తిరిగి వస్తాయని, మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాలు కొట్టుకోవాలని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకతా లేదని, పవన్ చెప్పే దానిలో లాజిక్ లేదని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.