Tirumalai Laddu | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ) : తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఏఆర్ డెయిరీ నిర్వాహకులు ఆ ఒప్పందానికి విరుద్ధంగా వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించారని, అనంతరం ఆ నెయ్యిని ఏఆర్ డెయిరీ ట్యాంకర్ల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్ అధికారులు గుర్తించారు. ఆ ట్యాంకర్లు వెళ్లిన మార్గాలు, టోల్గేట్ వద్ద ఆగిన సమయాలు సహా అన్ని ఆధారాలను పక్కాగా సేకరించారు. ఆ వివరాలను ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ డైరెక్టర్కు వివరించారు. అంతకుముందు వారు తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రసాదం తయారీకి సేకరిస్తున్న నెయ్యి, శనగపప్పు తదితర సరుకులతోపాటు వాటి నాణ్యతను పరీక్షించేందుకు ఏర్పాటు చేసిన ల్యాబ్ను పరిశీలించారు. పోటు ఏఈవో మునిరత్నంతో మాట్లాడి రోజువారీ విక్రయాలు, సరుకుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 18 గంటలకుపైగా సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతున్నది. శనివారం 72,692 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,645 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా శనివారం శ్రీవారికి రూ.3.37 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.