అమరావతి : టీడీపీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ( MP Kesineni Nani ) మరోసారి సొంతపార్టీ, అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిస్తే పెద్దస్థాయిలో ఉండేవాడినని అన్నారు. ఫిబ్రవరిలో నా నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ (TDP)లో కొనసాగాలా ? వద్దా ? అనే విషయంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ‘ ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలిచా. స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేసి మూడోసారి విజయం సాధిస్తాన’ ని ధీమాను వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో జరుగనున్న పార్టీ సమావేశానికి రావొద్దని తనకు సమాచారం అందించారని, చంద్రబాబు ( Chandra Babu) ఆదేశాలను శిరసా వహిస్తానని పేర్నొన్నారు. ఏడాదిగా కేశినేని నాని పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. తరుచూ పార్టీపై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీలోఆయన కేంద్ర బింధువుగా మారారు. పార్టీ మారుతాడని ప్రచారం జరుగుతున్నా వాటిని ఖండిస్తున్న నాని కొద్ది రోజుల్లో తన అనుచరులు, నాయకులతో కలిసి నిర్ణయం తీసుకోనున్నారు.