Srisailam | అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్తీక మాసోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీశైలం దేవస్థాన ఈవో లవన్న ఈ మేరకు దేవస్థాన దవాఖాన, అన్న ప్రసాద వితరణ భవనాల్లో వసతుల కల్పనను పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంచాలన్నారు. ఏ సమయంలోనైనా అత్యవసర వైద్య సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని వైద్యులకు లవన్న సూచించారు.
వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా దేవస్థాన దవాఖానలో ఆయా ఔషధాలు అందుబాటులో ఉంచాలని వైద్య విభాగం అధికారులను లవన్న ఆదేశించారు. ఎప్పటికప్పుడు దవాఖానకు అవసరమైన ఔషధాల జాబితాను సంబంధిత అధికారులకు అందజేయాలని వైద్యులకు సూచించారు. దేవస్థానం దవాఖానను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన సేవలు అందించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజినీరింగ్ విభాగం అధికారులకు లవన్న తగిన ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైల దేవస్థానం అందిస్తున్న వైద్య సేవలకు దాతల సహకారం పొందడం ఎంతైనా అవసరం అన్నారు. ట్రస్ట్ నిర్వహణలో భాగంగా ఔషధాల తయారీ దారులు, మెడికల్ ఏజెన్సీలతో సంప్రదించి ఔషధాలు, మందులు విరాళంగా పొందేందుకు కూడా ప్రయత్నించాలని దేవస్థానం వైద్యవిభాగాన్ని ఆదేశించారు.
అన్న ప్రసాద వితరణ భవనంలో ఏర్పాట్లను లవన్న పరిశీలించారు. కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని చెప్పారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నదాత విభాగాన్ని ఆదేశించారు. అన్న ప్రసాద వితరణలో భాగంగా ఏ రోజు ఏం వంటకాలు తయారు చేసి సరఫరా చేస్తారో సూచిక బోర్డులో పెట్టాలని, నాణ్యమైన కూరగాయలు తెప్పించుకోవాలని సిబ్బందిని లవన్న ఆదేశించారు.
భక్తుల అవసరాలకు అనుగుణంగా కార్తీక మాసంలో తగినంత సిబ్బందిని కూడా నియమించుకోవాలని సూచించారు. అన్న ప్రసాద వితరణ భవనంలోని మూడో హాలుకు వెంటనే మరమ్మతులు చేయాలని జనరేటర్, ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అటుపై అన్న ప్రసాద వితరణపై భక్తులతో లవన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం సహాయ ఈవో డీ మల్లయ్య, పీఆర్వో టీ శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.