తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో 18న(గురువారం ) సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత సాయంత్రం 5నుంచి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయం, ఉప ఆలయాల్లో దీపాలను వెలిగిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను రద్దు చేస్తున్నామని వివరించారు. పౌర్ణమి సందర్భంగా నవంబర్ 19న పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని అన్నారు.