Srisailam | శ్రీశైలం ఆలయంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్తీక మాసోత్సవాలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల విక్రయం, అన్నప్రసాదాల వితరణ, పారిశుధ్యం, కార్తీక సోమవారాల్లో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, నవంబర్ 15న కార్తీక పౌర్ణమి రోజున పుణ్య హారతి, జ్వాలా తోరణం, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి మొదలైన కార్యక్రమాలకు సంబంధించి వివిధ ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆర్జిత అభిషేకాలు బంద్
కార్తీకమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసమంతా కూడా గర్భాలయ ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే కార్తీకమాస రద్దీ రోజులలో అనగా శని, ఆది, సోమ వారాలు శుద్ధ ఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు ( కార్తీకమాసంలో మొత్తం 16 రోజులు) స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఈ రద్దీ రోజుల్లో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలిపివేశారు. కార్తీకమాసంలో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు.
ఇక కార్తీక మాస సాధారణ రోజుల్లో రోజుకు మూడు విడతలుగా స్పర్శదర్శనం, మూడ విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పించబడుతుంది. కాగా భక్తులు స్పర్శదర్శనం టికెట్లను, ఆర్జిత అభిషేకాల టికెట్లను ఆన్లైన్లో మాత్రమే పొందవలసి ఉంటుంది. ఇప్పటికే నవంబరు నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశం కల్పించబడింది. టికెట్లను www.srisailadevasthanam.org వెబ్సైట్ ద్వారా పొందవచ్చు లేదా ఆండ్రాయిడ్ మొబైల్లో srisaila devasthanam యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా టికెట్లు పొందవచ్చు.
ఇతర ఆర్జితసేవలు :
కార్తీకమాసంలో శని, ఆది, సోమవారాలు, కార్తీకశుద్ధ ఏకాదశి , కార్తీక పౌర్ణమి రోజులలో అమ్మవారి అంతరాలయంలో జరుపబడే కుంకుమార్చనను ( రూ.1,000/-ల టికెట్టు) వేదాశీర్వచన మండపంలో జరిపించుకోవచ్చు. అమ్మవారి ఆలయంలో నిర్వహించు రూ.500/-ల కుంకుమార్చన టికెట్టును ఆయా రోజులలో నిలుపుదల చేయడమైనది. ఇతర గణపతి హోమం, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం మొదలైన ఆర్జితసేవలు యథావిధిగా జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థమై రద్దీ రోజులలో రుద్రహోమం, మృత్యుంజయహోమం రెండు విడుతలుగా జరుపబడుతాయి.
భక్తులకు అన్నదాన భవనములో ఉదయం 10.30 నుండి అన్నప్రసాదాల వితరణ చేయబడుతుంది. సాయంత్రం గం. 7.00 నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడుతుంది. క్యూకాంప్లెక్స్లో దర్శనానికి వేచి ఉండే భక్తులకు మంచినీళ్లు, బిస్కెట్లు, అల్పాహారం అందజేయబడుతాయి. కార్తీక మాసంలో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. పాతాళగంగ వద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది.